ప్రజల మూఢనమ్మకాల్ని, అత్యాశల్ని ఆసరా చేసుకొని దోచుకోవడమే జ్యోతిష్యం

25/11/2009

జ్యోతిష్య శాస్త్రమంటే జాతక చక్రాల్ని నిర్మించడం, చదవడం, మంచి, చెడ్డ కాలాల గురించి చెప్పడం, మరియు భవిష్యత్తు గురించి తెలుసుకోవడం. జ్యోతిష్యం ద్వారా భూత ( జరిగింది ), వర్తమాన ( జరుగుతున్నది ), భవిష్యత్తు ( జరుగబోయేది ) తెలుసుకోవచ్చనుకుంటారు. కానీ హేతువాదైనవారెవరైనా జాగ్రత్తగా పరిశీలించి జ్యోతిష్యానికి మతంతో చాలా దగ్గరి సంబంధం ఉందని తెలుసుకుంటారు. ఎందుకంటే జ్యోతిష్యం మతం పునాదిగా కలిగినంతగానే మూఢనమ్మకాల్ని కూడా పునాదిగా కలిగిఉంది. బ్రాహ్మణ పురాణాల్లోని గాధలూ, జ్యోతిష్యానికి ఆధారమైన నక్షత్రాలూ, గ్రహాలూ, తిధులూ మంచి రోజులకు సంబంధించిన గాధలూ ఒకేలా ఉంటాయి. గ్రహాలకూ నక్షత్రాలకూ కల్పించిన లక్షణాలు కూడా చాలా వరకు పురాణ గాధల్లోని కల్పితాలనుంచి తీసుకున్నట్లుగానే కన్పిస్తాయి. బ్రాహ్మణమతవాదులు చాలావాటిని నమ్ముతారు. దేవతపూని మనిషి నాట్యం చేయడం, చనిపోయినవాళ్ళు దెయ్యాల రూపాల్లో మాట్లాడ్డం, మనుషులకు జబ్బులు వచ్చేట్టు చేయడం, లేదా మనుషుల్ని చంపడం, పిల్ల దెయ్యం ( కుట్టి సైతాన్ ) ద్వారా మనుషులకు కష్టాలూ, చికాకులు కలిగేట్టు చెయ్యడం, చేతబడి ద్వారా మనుషులను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం, పూర్వపు కర్మల ద్వారా మనుషుల జీవితాలు మార్చడం, – ఇవన్నీ బ్రాహ్మణమతవాదులు తమ క్షేమం కోసం, ఎదుటి వాళ్లను చంపడం కోసం నమ్ముతారు. ఈ అనిశ్ఛిత కళలమీద లెక్కకట్టలేనంత సమయమూ, డబ్బూ, శక్తీ వృధా అవుతున్నాయి. అట్లాగే జ్యోతిష్యం మీద కూడా బ్రాహ్మణమతస్తులు లెక్కలేనంత డబ్బూ, సమయమూ వృధా చేస్తున్నారు. ఈ తప్పుడు అనశ్చిత కళల్ని నమ్మిన ప్రజలు మరిన్ని కష్టాల్ని కొని తెచ్చుకున్నారు. జ్యోతిష్కుడూ, మంత్రగాడు, పూజారి – ముగ్గురూ కూడా ప్రజల మూఢనమ్మకాల్మి , అత్యాశల్ని ఆసరా చేసుకొని ప్రజల్ని దోచుకోవడంలో మొదటివాళ్ళు. ఈ ముగ్గురు పరాన్నభుక్కుల వ్యాపారాలు ఒకదానితో ఒకటి తమ స్వలాభం కొరకు సంబంధాలు కలిగివుంటాయి. జ్యోతిష్కుడు భవిష్యత్తులో చెడు సమయాలు ( గండాలు ) , కష్టాలు ఉన్నాయని భయపెట్టి బాధితుడ్ణి పూజారి దగ్గరకు పోయి ప్రమాదం జరుగకుండా ఉండటానికి నవగ్రహాలకు ప్రత్యేక పూజలు ( అర్చనలు, అభిషేకాలు ) జరిపించుకోమంటాడు. జ్యోతిష్కుని భవిష్యత్తు ఊహల యొక్క ఫలితం – దేవుళ్ళ కోపం తగ్గటానికో , పోగొట్టటానికో జరపమనిచెప్పే శాంతిపూజలుతప్ప మరింకేంకాదు. దుష్టగ్రహాల పేరు చెప్పి జ్యోతిష్కుడు , మంత్రగాడు, గుడిపూజారి ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్మును దోచేస్తారు. స్వలాభం కోసం చేస్తున్నామన్న పేరు రాకుండా ఉండడానికి ఈ ముగ్గురు కుట్రదారులు వీధి వ్యాపారస్తునికీ, వీధి బిచ్చగాడు లేదా సాధువుకు కూడా ప్రయోజనం చేకూరుస్తారు. ఎట్లాగంటే శాంతి కార్యక్రమానికి వస్తువులు వ్యాపారస్తుని దగ్గరనుండి కొనిపిస్తారు. ఒక్కోసారి బీదవాడికి లేదా బిక్షగాడికి ( సాధువుకు ) భోజనం పెట్టిస్తారు. ఆ రకంగా బాధితులతో చేపించేది దేవతల శాంతి కొరకే గానీ కుట్రదారులైన తమ కొరకు గాదని నమ్మేట్టు చేస్తారు. -పెరియార్

దేశంలో 196 భాషలను రక్షించే దెవరు?

17/08/2009

2008, జనవరి ,21న మేరీ స్మిత్ జోన్స్ మరణించింది. ఆమె అమెరికాలోని అలాస్కా ప్రాంతంలో ఇండియన్ మూలాలకు చెందిన ఒక సాధారణ ఆదివాసీ మహీళ. జార్ఖండ్ రాజధాని రాంచీకి ఆనుకొని వున్న అనాగరిక ప్రాంతాల్లోని సంతల్లో తిరిగే ఒక మహిళలానో , లేకపోతే రాజమహళ్ళకు సుదూరంగా కొండకోనల్లో పర్వత పంక్తుల్లో నివసించే బిర్ హార్, అసుర్ లేదా ఇతర కొండప్రాంతపు ఆదివాసీ గుంపుల్లో సభ్యురాలి వంటి స్త్రీ ఆమె. అంతర్జాతీయ స్తాయీ గౌరవాలు పొందటం వల్లనో , గొప్ప గొప్ప పనులు చేయడం వల్లనో మనం ఆమెను గుర్తుంచుకోవాల్సిన అవసరంలేదు. ఆమె ఒక సాధారణ మహిళ మాత్రమే కానీ 1918 మే 14న పుట్టిన మేరీ స్మిత్ 2008 జనవరి 21న తన తన ఆఖరి శ్వాస తీసుకుంటున్న సమయంలో ప్రపంచం చూపులన్నీ ఆమెమీద కేంద్రీకృతమయ్యాయి. ఎందుకంటే ఆమె అమెరికాలోని సౌత్ సెంట్రల్ అలాస్కాలోని కొర్దోవా ప్రాంతములోని ఇయాక్ ఆదివాసీ సమూహంలో తమ మాతృభాష అయిన ఇయాక్ లో మాట్లాడడం తెలిసిన  చివరి మహిళ. ప్రపంచంలోని 6000 భాషలలో ఒకటైన ‘ ఇయాక్ ‘ 2009 జనవరి 21న మేరీ స్మిత్ మరణంతో ఈ ప్రపంచం నుండి పూర్తిగా నిష్క్రమించింది. 21వ శతాబ్దంలో భాషలు మరణిస్తున్న సందర్భం ఇదొక్కటే కాదు. 20వ శతాబ్దంలో వలసరాజుల కాలంలోనూ , తర్వాత కాలంలోనూ వందల సంఖ్యలో భాషలు ఈ ప్రపంచం నుండి అదృశ్యమయ్యాయి. మేరీస్మిత్ జోన్స్ ను స్మరించుకోవడానికి ఇంత ప్రాముఖ్యత కలగడానికి కారణం  ఇది ఒక భాష మరణిస్తున్న తాజా సందర్భం అవటమే.

యునెస్కో  ‘ప్రమాదంలో ప్రపంచ మాతృ భాషలు – 2009’ అనే రిపోర్టును విడుదల చేసింది. ఈ రిపోర్టులో 196 భారతీయ భాషల అస్థిత్వం కూడా ప్రమాదంలో ఉందని తెలియజేస్తుంది. ఈ 196 భారతీయ భాషలలో 8 భాషలు ( ‘ ఆంగిక ’ భాషను కలుపుకుంటే 9 ) జార్ఖండుకు చెందినవి. ఒబామా కేవలం 20 భారతీయ భాషలను గురించి మాట్లాడితేనే మీడియా దానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చింది. కానీ  యునెస్కో ప్రకటనను మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే వీటిలో ఏవో కొన్ని మినహాయిస్తే అన్నీ ఆదివాసీ భాషలే. ఈ ఆదివాసీ భాషలన్నింటినీ ఒబామా చెబుతున్న భాషలే మింగివేస్తున్నాయి.

భారతదేశంలో 1650 భాషలూ, మాండలీకాలూ ఉన్నాయి. వాటిలో 400 భాషలు వాడుకలో ఉన్నాయి. రాజ్యాంగపరంగా చూస్తే 22 భాషలు మాత్రమే అధికార భాషలుగా గౌరవం పొందుతున్నాయి. వాటిలో సంతాలీ , బోడో మాత్రమే ఆదివాసీ భాషలు. యునెస్కో విడుదల చేసిన భాషల స్థితిగతుల రిపోర్టు 2009  ( 20 ఫిబ్రవరి 2009 )  ప్రకారం ప్రపంచ  వ్యాప్తంగా సుమారు 1500 భాషల పరిస్థితి గురించి వివరణ ఇవ్వబడినది. ఈ భాషలన్నీ 21వ శతాబ్దాంతానికి మృతభాషలుగా మారనున్నాయి. ఈ క్రమం 5 విభాగాలుగా గుర్తించింది. మొదటి విభాగంలో ఇప్పటితరం మాట్లాడడనికీ, వ్యవహారానికీ భాషగా వినియోగించకుండా ఎప్పుడైనా బలవంతంగా ఇంట్లో మాట్లాడే భాషలు. 2వ విభాగంలోనూతన తరం తమ మాతృభాషగా స్వంతం చేసుకోవడానికి నిరాకరించే భాషలున్నాయి. తాతలూ,నానమ్మలు మాట్లాడగలిగితే , తల్లిదండ్రులు కేవలం అర్ధం చేసికోగలుగుతారు. కానీ నూతన తరానికి ఏమీ తెలియని, అర్ధం కాని భాషలు మూడవ తరంలో ఉన్నాయి. నాలుగవ విభాగంలో భాషలైతే తాతయ్య నాయనమ్మలు అర్ధం చేసుకోగలరు కానీ మాట్లాడలేరు. తల్లిదండ్రులకైతే వారిమాతృభాష రానేరాదు. ఇక చివరి ఐదవ విభాగంలో ఉన్న భాషలు మాట్లాడేవాళ్ళు చెదురుమదురుగా అక్కడక్కడా ఉండవచ్చు లేదా ఎవ్వరూ మిగిలియుండకపోవచ్చుకూడా. మొదటి విభాగంలో 84 భారతీయ భాషలున్నాయి. 2వ విభాగంలో 62, మూడవ విభాగంలో 6, నాల్గవ విభాగంలో 35, ఐదవ విభాగంలో 9 భారతీయ భాషలున్నాయి.

ఈ ప్రపంచంలో ఆదివాసీ భాషలెప్పుడూ చిన్నచూపు చూడబడుతూనే ఉన్నాయి. ఆదివాసీ ప్రాంతాలలో లభించే వనరులను దోపిడీ చేయడానికిగాను రాజకీయంగానూ, సాంస్కృతికంగానూ వారి భాషా సంస్కృతులపై దాడి జరుగుతూనేవుంది. హిందీ భాషాసమాజం తెలిసోతెలియకో ఆదివాసీ భాషలను రూపుమాపే కుట్రలో భాగమవడం అనేది విచారకరమైన విషయం. గౌరవపూర్వకమైన స్థానం గానీ, భాగస్వామ్యం గానీ లభించకపోవడం వల్లనే ఇతర భాషలు హిందీభాషకు వ్యతిరేకంగా నిలబడుతున్నాయి. హిందీ భాష కంటే గ్లోబల్ భాషైన ఇంగ్లీషును నేర్చుకోంటే మంచిదనే భావనలో ఉన్నాయి. మాతృభాషలో ప్రాధమిక స్థాయిలో విద్యాబోధన జరగాలనే ప్రభుత్వ సూచనలు అమలు జరగడంలేదు. ఫలితంగా ప్రాంతీయభాషల, ఆదివాసీ భాషల మనుగడ ప్రశ్నార్ధకంగా మారి, భాషల చిత్రపటంనుండి అవే పూర్తిగా కనుమరుగవబోతున్నాయి.

- అశ్వనీకుమార్ పంకజ్.

ధర్మపోరాటం

10/03/2009

ఆ బాలికకు తొమ్మిది సంవత్సరాలు. కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేర్చబడ్డది. ఆమె గర్భవతి యని, ఆమెకడుపులో కవలపిల్లలున్నారని కనుక్కున్నారు డాక్టర్లు . దీనికి కారణం ఆబాలికను రేప్ చేసిన ఆ బాలిక యొక్క మారు తండ్రని తెలిసింది.  అతడు ఆబాలిక ఆరవయేటనుండి అనేక విధాలుగా తిడుతూండేవాడట. ఆబాలిక మరీ బలహీనంగా వుండటం వల్ల ( 32 కిలోలు ), ఆమె గర్భాశయం కనీసం ఒక్క పిల్లనైనా భరించేంత శక్తికూడా లేనందున డాక్టర్లు ఆమెకు అబార్షన్ చెయ్యాలని నిర్ణయించారు.

కానీ ఆబాలిక నివసిస్తున్నప్రాంత  స్థానిక మతసంస్థ అయిన కథోలిక చర్చి ఏదియేమైనా ఆ బాలిక చచ్చుటయే మంచిదని తీర్మానించింది. బ్రెజిల్ దేశపు ఈశాన్యప్రాంతపు కథోలిక గురుమండల పీఠాధిపతి ఆర్చిబిషప్ స్వాములవారు  ఆ గర్భస్రావ చర్యను నిరోధించుటకు విఫలయత్నంచేశారు. ఎప్పుడైతే వారి ప్రయత్నాలు సాగలేదో ఆబాలిక తల్లిని, తన మాట వినని ఆ వైద్యబృందాన్నంతటినీ వెలివేసినట్లు ప్రకటించారు. 

ఈ సంఘటన కేవలం బ్రెజిల్ దేశ ఈశాన్యప్రాంతానికో లేక ఆ దేశానికో మాత్రమే సంబంధించినది కాదు.  మార్చి 7 వ తేదీన వెలివేయడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న జనసందోహంతో వాటికన్ అధికార ప్రతినిధి కార్డినల్ గియోవన్నిబాటిస్టా రె తమ చర్యను సమర్థిస్తూ ఇది చర్చి నిబంధనలకు వ్యతిరేకమని చెప్పారు.  వెలివేయడం అంటే వారికి చర్చీకి సంబంధించిన, మతానికి సంబంధించిన కార్యక్రమాలకు హాజరగుటకు వీలులేకుండ బహిష్కరించుట .  ఈ విథమైన  బహిష్కరణ సాధారణంగా జరిగే విషయాలు కావు. చాలా తీవ్రమైన చర్యలకు మాత్రమే ఈ బహిష్కరణ శిక్ష ఉంటుంది, కథోలిక మత సిద్థాంతాలను సవాలు చేసినా, మత విశ్వాసులను విభజించుటకు ప్రయత్నించినా, వారిని కన్ఫ్యూజ్ చేసినా సంఘ బహిష్కరణ శిక్ష విధించబడుతుంది. రేప్ చేసినటువంటి ఆ మారుతండ్రికి సంఘము నుండి వెలి వేయబడే శిక్ష విధించబడలేదు. కార్డినల్ గారు చెప్పిన ప్రకారం రేప్ చేయడం అనే పని అబార్షన్ చేయడం కంటే పెద్ద తప్పుకాదట. లాటిన్ అమెరికా దేశాలకు కూడా ఇన్చార్జి అయిన  ఈ కార్డినల్ గారు లా స్టంపా అనే ఇటలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ఇంకా ఇలా అన్నారు. ఇది ఒక విషాదకరమైన విషయం కానీ ఇందులోని నిజమైన సమస్య ఏమిటంటే ఆబాలిక గర్భంలోని కవలలు ఇద్దరు అమాయకులైన వ్యక్తులు- వారికి గల జీవించే హక్కుహరించబడరానిది “.

వాస్తవానికి అబార్షన్ చెయ్యకపోయుంటే గర్భస్త శిశువులతోపాటు ఆకన్యక కూడా మృతిచెందివుండేదని వైద్యుల వాదన.

బ్రెజిల్ చట్టాల ప్రకారం తల్లిప్రాణానికి ప్రమాదం సంభవించగల సందర్భంలోనూ, గర్భస్థ శిశువుకు తండ్రి ఎవరో తెలియని సందర్భంలోనూ అబార్షన్ చెయ్యవచ్చు.

మరి వైద్యుల వాదనా, చర్చి వాదనలలో ఎవరి ఆలోచన సరైందని చెప్పవచ్చునో ఆలోచించండి.

4.సామాజిక స్పృహ విప్లవ చైతన్యం

12/02/2009

జ్వాలాముఖి

సామాజిక స్పృహ అనేది అభివృద్ధి చెందే విప్లవ చైతన్యం అని గుర్తించాక దానిని నిత్య నూతనం చేసుకునే బాధ్యత కూడా కవి మీద పడుతుంది.

కవిత్వం సామాజిక అభివృద్ధి క్రమంలో పోరాడుతున్న ప్రజల చైతన్య స్ధాయిని బట్టి కూడా వినియోగించాల్సిన భావ ప్రేరణ ఆ రచన ప్రజల స్థాయి కన్నా కొంచం ముందుగా వున్నా నిష్ఫలమే అవుతుంది. అలాగే వెనుకబడి వున్నా వీగిపోతుంది. కారణం ఆ కవి సమకాలీనంగా ఎదగని దశలో ఉన్నట్లు ఋజువవుతాడు. - కవి తన చైతన్యాన్ని బట్టిగాక ప్రజల చైతన్యాన్ని బట్టి సామాజిక అవసరాలమేరకు ప్రవర్తించడం అభివృద్ధి క్రమం దృష్ట్యా చాలా అవసరం – ఈ మెలకువ తనమే కవి యుగ కర్తృత్వాన్ని నిర్ణయిస్తుంది.

మార్పును కోరేవారంతా వ్యవసాయ విప్లవం జరగాలంటున్నారు. దాన్ని ఇరుసుగా నడిపి నిజమైన ప్రజల ప్రజాస్వామిక విప్లవాన్ని సాధించాలంటున్నారు. ఈ దశలోనే జాతి విముక్తి సాధ్యం కాగలదనేది తేలిన అంశం- ఈ జనతా ప్రజాతంత్ర విప్లవంలో అన్ని రకాల ప్రజల్ని సమీకరించడం , పోరాటానికి ఆయత్తం చేయడం, విప్లవాన్ని సాధించడం అనేవి లక్ష్యాలుగా వుంటున్నాయి. వీటికి మార్గదర్శక సూత్రాలేవి?

మన వ్యవస్ధ శ్రమ దోపిడిని కేంద్రంగా చేసుకొని జీవిత విలువల్ని నిర్ణయించింది. అసంఖ్యాకులకు అన్యాయం చేస్తున్నది. శ్రమదోపిడీ నిర్మూలనను లక్ష్యించే ఫ్యూడల్ వ్యతిరేక ప్రజా ఉద్యమాలకు బాసటగా నేటి సామాజిక స్పృహ సాహిత్యంలో ప్రతిబింబించాలి. అలాగే ఫ్యూడల్ భావాలతో కుమ్మక్కవుతున్న సామ్రాజ్యవాదాల జోక్యందారీ విధానాలకు వ్యతిరేకంగా కూడా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయాలి. భూస్వామ్య వ్యతిరేక, సామ్రాజ్యవాద వ్యతిరేక లక్షణాలు కలిగిన సామాజిక స్పృహ నేటి తెలుగు కవిత్వంలో ప్రతిబింబించాలి. భూస్వామ్య విధానం మానవ జీవితాన్ని విషాక్తం చేసింది. దానికి మద్దత్తుగా సామ్రాజ్యవాదం విధానం వలన సంస్కృతిని దిగుమతి చేస్తున్నది. దీన్ని నేటి కవితా ప్రయోజనం ప్రతిఘటించాలి.     

వ్యవసాయ విప్లవం అనేది ప్రధానంగా వచ్చినప్పుడు గ్రామీణ స్ధాయి పోరాట ప్రజలకు కవిత్వం అందాలంటే వారి కళారూపాలు స్వీకరించి విప్లవీకరించాలి. జానపద కళా రూపాలు పోరాట చైతన్యంలోకి అనువదించాలి. ఇక్కడ శిల్పం కోసం వస్తువును పాడుచేయరాదు. బాణీ కోసం ప్రజల్ని మభ్యపెట్టరాదు. అలాగే వస్తువు స్పష్టత కోసం కవిత్వాన్ని వాక్యంగా మార్చరాదు. ప్రతి కవిత్వం ప్రచారమే కానీ ప్రతి ప్రచారం సాహిత్య రూపం కాజాలదు. కారణం అది ప్రేరణను కోరుతుంది. ప్రేరణకు ప్రజల నుడికారం చాలా అవసరం. వస్తు రూపాల సమన్వయం సామాజిక స్పృహలో ప్రతిబింబించాలి.

నేటి కవిత్వం అనేది శిల్ప కళా రూపంలో జాతీయం (National in form ) గాను, వస్తువులో విప్లవాత్మకంగానూ ఉండాలి. ( Revolutionary in Content ) ఈనాటి ఈ కవితా ప్రయోజనాన్ని గ్రహించి , నిత్య నూతనంగానూ ప్రజల పోరాట పటిమను బాధ్యతతో రచనల్ని చేయడమే సామాజిక స్పృహ. దీన్ని తెలిసో తెలియకో కాదనే వాదమల్లా స్వీయ మానసిక వికారం కాగలదు. కవి తనకోసం కాక తన చుట్టూ ఉన్న ప్రజలకోసం బ్రతకటమే సామాజిక స్పృహ.

-  సెప్టెంబరు 1979

3. సామాజిక స్పృహ వ్యక్తివాదం కాదు

06/02/2009

పాలకవర్గం పరిధిలో ఉండి ఆలోచించే సాహితీ వేత్తలు చిత్రవిచిత్ర వాదనలు ముందుకు తెస్తున్నారు. గుంటూరు శేషేంద్ర శర్మ లాంటివాళ్ళు పీడక సాహిత్య లక్షణాల్నికరదీపాలుగా ర్రహించి పీడిత ప్రజలకు పరిష్కారాలు సూచిస్తూ కవి సమాజానికి అతీతుడు ,శాసనకర్త, సర్వస్వమును అని ప్రతిపాదిస్తున్నారు.

ఇంకా కొంచం ముందుకు పోయి కవి ఆధిక్యతా భావాన్ని ఒక వాదంగా ముందుకు తెచ్చే కవిసేన ను ప్రచారం చేస్తూ మానవ సమస్యల్ని కవులు మాత్రమే పరిష్కరించగలరనే భ్రమల్ని సుస్తిరం చేస్తున్నారు. దీనితో పాటు రాజకీయం జీవితములో ఒక భాగమే గానీ రాజకీయమే జీవితం కాదని సూత్రీకరిస్తున్నారు. ఎంతవరకయితే రాజకీయాలు ప్రజాపరంగా నిర్ణయం కావో అంతవరదాకా జీవితం బాధా విముక్తం కాదనే సామాజిక సత్యాన్ని శేషేంద్రశర్మ గారు గుర్తించలేకపోతున్నారు. ఇక్కడ కవి పుట్టించిన చోటే పుట్టిన మరుక్షణంలోనే మరణాన్ని వరంగా వరిస్తున్నాడు.

ఈ వరసలోనే ఏనాడో కాలగర్భంలో కలసిపోయిన సౌందర్య వాదాన్ని కళ కళకోసమనే ఆయన వాదాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇస్మాయిల్ కవిగారు మానసికానందం కోసం కవిత్వం అంటారు. మానసిక ఆనందం అనేది వ్యక్తి అనుభవించే జీవితాన్నిబట్టి నిర్ణయింపబడుతుందనే చేదు నిజాన్ని వారు గుర్తించడంలేదు.

పెట్టుబడిదారీ సమాజపు వికృత అస్తవ్యస్త స్థితిని చూసి జీవితం చాలా అడ్డదిడ్డంగా ఉందనే అంశాన్ని చాటడానికి నగ్నముని లాంటి కేవలం ప్రయోగవాదులు విలోమ కవితలు అనే భ్రమల్ని ముందుకు తెస్తున్నారు. కవిత్వంలో తిర్యక్కులు వీళ్ళు.

వర్గ పోరాటాల విస్తృతిలో ప్రజలు ఒక స్పష్టతను కోరే తరుణంలో స్పష్టంగా బయటపడి చెప్పే ధైర్యం లేక అవగాహన లేక ప్రజలతో తాదాత్మ్యం చెందే ఆత్మ వికాశం లేక కవి అహంకారియై ప్రజల్నుండి వేరుపడే ప్రయత్నంలో ప్రయోగవాదాన్ని స్వీకరిస్తాడు. ఇదివరకు పట్టాభి, ఆరుద్రలు అలాంటి సర్కస్ ఫీట్లు చేశారు. అందులోని ఆరవ వేలే విలోమ కవిత .ఇది పెట్టుబడిదారీ సమాజపు అమ్మకాల ఆకర్షణ . దోపిడీ గాళ్ళ సేల్స్ మన్ షిప్.

ప్రక్రియా వాదాన్ని సాహిత్యోద్యమంగా తెచ్చిన ప్రవక్తలు సంక్షుభిత సమాజంలో పరిష్కర్తలుగా ముందుకు వస్తున్నారు. సాహిత్య ప్రమాణాలు రూపాలు , శిల్ప బేధాలు , వస్తు విశేషాలు మారే సమాజాన్ని బట్టి అభివృద్ధి చెందుతాయి.

పద్యం ఫ్యూడల్ సమాజపు నియమాల్ని చాటిన నిలయ విద్వాంసుని గాత్ర విశేషం. అందువల్ల పద్యం ఛందో రూపాన్ని మార్చినంత మాత్రాన కవిత్వం ఆధునికమైపోదు. ఆధునిక జీవిత అభివ్యక్తి సౌలభ్యం కోసమే పద్యం ముక్కచెక్కలై గేయంగానూ , గేయం చెడి వచిన కవిత్వం గానూ అభివృద్ధి చెందింది. ఈ సామాజిక అంతస్సూత్రాన్ని విడిచి కేవలం వచన కవిత్వం రాస్తే ఆధునిక జీవిత చిత్రణకు సంబంధించిన సాహిత్య ప్రయోజనం సమకాలీన సమాజంలో నెరవేరదు. వచన కవిత్వం ప్రక్రియనే ఒక ఉద్యమంలో స్వీకరించిన కుందుర్తి గారు ఈ సత్యాన్ని అంగీకరించడంలేదు. వస్తువు ప్రయోజనం చాల ప్రధానం – అలా అని ఆధునిక వస్తువును ప్రాచీన రూపంలో రాస్తే (పద్యం చెబితే) అంతగా ప్రయోజనం నెరవేరదు.

ఈ వర్గసమాజం వస్తువు “ ( content )కు రూపానికి” ( form ) ఒక వైరుధ్యాన్ని తెచ్చిపెట్టింది – పాశ్చాత్య సాహిత్య సంపర్కం వల్ల శిల్ఫ వైభవాన్ని పెంచి , వస్తువును దిగమింగే ప్రయోగవాదం ఒక వైపు విజృంభిస్తున్నది. – మరొక వైపు వస్తువును నినాదప్రాయం చేసే అవాస్తవిక దృష్టి విస్తరిస్తుంది. నిజమైన ప్రజా కవిత్వం ఇటు వస్తువుకు, అటు రూపానికీ సమన్వయం సాధిస్తుంది. – అది అభివృద్ధి చెందుతున్న అధిక సంఖ్యాకులైన ప్రజల ప్రయోజనాల్ని చాలా స్పష్టంగా శాస్త్రీయంగా అంగీకరించినప్పుడే సాధ్యపడగలదు.- అందుకే ఉద్యమాల రోజుల్లోనే మంచి కవులు పుడతారు.- తిరిగి వారు ఉద్యమాల ఊపిరి కాపాడుతారు.

తెలుగు కవిత – సామాజిక స్పృహ 2

23/01/2009

2. మార్పును గుర్తించిన ద్రష్టలు

ఘర్షించుకునే సామాజిక శక్తుల్ని పరిశీలించి పీడిత శక్తులకు విజయం తప్పదనే నిర్ణయానికి వచ్చిన ప్రజల శ్రేయోభిలాషులు సాహిత్యరంగంలో క్రాంత దర్శులు గా ప్రకాశించారు. వారిలో గురజాడ అప్పారావుగారు ఆద్యులు. రాచరికాల దౌష్ట్యంలో బందీ అయిన  కన్యక బలిదానం చేసుకొని , రాజు కిరాతకాన్ని ప్రతిఘటించమని పరోక్షంగా చాటుతుంది. రాజ్యాధికారం ఉందని కండకావరంతో ప్రవర్తించే పాలకుల నాశనం తప్పదంటుంది. తత్ఫలితంగానే వీరమరణాన్ని చూస్తున్న ప్రజలు తిరగబడి కోటల్ని నేలమట్టం చేశారు. రాచరికాల అనివార్య పతనాన్ని ప్రజాస్వామిక యుగారంభాన్ని చాల సహజ పరిమాణంగా యుగచైతన్యంతో చెప్పిన స్రష్ట గురజాడ అప్పారావు – అందుకు వారి కన్యక కావ్యం మకుటాయమానం.

సామాజిక స్పృహ ను రాజ్యాధికారుల దౌష్ట్యాలకు వ్యతిరేకంగా చాటినా – గురజాడ వారు పూర్తిగా సాంప్రదాయ పట్టులోంచి బయటపడలేదనేది కూడా పరిశీలించాల్సి ఉంటుంది. వారు సూచించిన పాతకొత్తల మేలు కలయిక అభివృద్ధిచెందే సమాజానికి ఎంత ప్రతిబంధకమో నిర్మొహమాటంగా ఆలోచించాల్సివుంటుంది.

అందువల్ల సామాజిక స్పృహ  అనేది నిత్య నూతనంగా అభివృద్ధి చెందే అభ్యుదయ సూచిక అని కొంతవరకు మాత్రమే పోయి ఆగిపోయే పోటీ యత్నము కాదు.

దారిపక్క బిచ్చగత్తెలు , రాక్షసరతి   లో నలిగే పడుపుగత్తెలు, సమ్మెగట్టే కూలీలు, కూలీల భార్యలు , ఉరికంబాలకు వేలాడే ధీరులు కావ్యవస్తువులుగా గ్రహించిన అభ్యుదయ కవిత్వం , దగాపడిన తమ్ముళ్ళందరినీ పదండి ముందుకు అని విప్లవ శంఖం పూరించింది. తెలుగు కవిత్వంలో ఈనాటి సామాజిక స్పృహ  ఒక నిర్ణయాత్మకమైన మలుపును తీసుకుంది.

మొట్టమొదటి సారిగా సామాన్యుని మాన్యుగా చేసిన సాహిత్యోద్యమం    అభ్యుదయ కవిత్వం . అయితే కవి తనకు తానుగా సాధించిన నూతన విషయం కాదనేది కూడా గుర్తించాలి. దాన్ని కవి చేసిన అద్భతంగా మాత్రమే గుర్తిస్తే అభివృద్ధి చెందే ప్రజల నిర్ణయాత్మక పోరాట శక్తిని నిర్లక్ష్యం చేసిన వారలం కాగలం. అలా చారిత్రక పరిణామాల్ని వర్గ పోరాటాల విజయాల ద్వారా ముందుకు తెస్తున్న ప్రజల్ని గుర్తించడంలో కవి కృతకృత్యుడైనాడనేది సత్యం. కానీ కవి మాత్రమే పోరాట సత్యాన్ని సృష్టించాడనేది అసత్యం. ఈ వివేచనా లోపం వల్లనే కొందరు కవులు శాసకులుగా ప్రజల మీద స్వారీ  చెయ్యడానికి సాహసిస్తున్నారు. కవి అహంకారి కాదు.

కవి నడుస్తున్న చరిత్రలో వెలుగులు చూస్తాడు. కాబట్టే అతడు క్రాంతదర్శి. ఈ క్రాంత దర్శిత్వం చూసే నిత్య వికాసమే     సామాజిక స్పృహ . ఇది దినదిన ప్రవర్ధమానమయ్యే ఆత్మ చైతన్యం. అభ్యుదయ కవితా ఉద్యమం , మార్పును సంస్కరణ వాదానికి ముడివేసి ఊరుకుంది. వ్యవస్థను సమూలంగా మార్చకుండా కొన్ని సంస్కరణల్నిలక్ష్యిస్తే సరిపోదు. నలుగురు కలసి పొరుపులు మరచీ చేయాలి ఉమ్మడి వ్యవసాయం అనే రాజకీయ కార్యక్రమ నినాదం ఎలాంటి సంస్కరణ వాదాన్ని సూచిస్తుందో పరిశీలించండి. భూముల పంపకం కాకుండా ఉమ్మడి వ్యవసాయం   అనేది నెహ్రూగారి గమ్మత్తు. దానికి కవి బలికారాదు. వ్యవసాయ విప్లవం మాత్రమే రైతు సోదరులకు న్యాయం చేస్తుంది.

అందువల్ల సంస్కరణలు కూడా సమాజం సమూలంగా మారే విప్లవ క్రమంలో భాగం కావాలి గానీ , విప్లవాన్ని గల్లంతు చేనే కార్యక్రమాలు కారాదు. అందుకే సంస్కరణవాదం సర్వరోగ నివారిణి కాదు. అది దారి తప్పించే రాజకీయ వ్యూహంలో దానికి కవి బలికారాదు.  అభ్యుదయకవి బలి అయినాడు.

సంస్కరణలద్వారా సామాజిక సమస్యలు పరిష్కరింపబడతాయనే భ్రమల్లో ప్రజలు లేరు. సంస్కరణవాదానికి కాలం చెల్లి పోయింది. ఇది సమాజం సమూలంగా మారాలనే విప్లవాల యుగం. అమెరికా ప్రపంచవ్యాప్తంగా పోరాటాల విస్తృతి కొనసాగుతుంది. పరాయి పాలనలో మగ్గుతున్న దేశాలు ( ఆఫ్రికా ) స్వాతంత్ర్యాన్ని కోరుతూ  తెగించి పోరాడుతున్నాయి. అలాగే పీడిత జాతుల విముక్తి కోరుతున్నాయి. ప్రజలు విప్లవాన్ని కోరుతున్నారు. అభివృద్ధి చెందిన ఈ ప్రపంచ నైజాన్ని నేటి కవి గుర్తించి తన సామాజిక స్పృహ ను నిత్యనూతనంగా మార్చుకోవాలి. అలా మార్చుకోవడంలో అభ్యుదయ కవి విఫలం అయ్యాడు. కాబట్టే విప్లవకవి తెలుగు సాహిత్యానికి అవసరం అయ్యాడు.. ఈ విధంగా అభివృద్ధి చెందిన కవి తిరిగి సంక్షోభానికి గురై ప్రజలు మాత్రమే విప్లవాన్ని తద్వారా సమూలమైన మార్పును తెస్తారనే నైజాన్నికొందరి వీరుల సాహస చర్యగా భావించి విప్లవ బాధ్యతారంగాన్ని సంకుచితం చేశాడు.

అందువల్ల సామాజిక స్పృహ అనేది వ్యక్తి చైతన్యమే కాదు సమాజ స్పందన కూడా. తనలో తాను అభివృద్ధి చెందుతూ , అభివృద్ధి చెందుతున్న అధిక సంఖ్యాకపు ప్రపంచంతో తాదాత్మయం చెంది ముందుకు పోయే పోరాట నైజాన్ని గుర్తించాలి. తాను ముందుకు పోతూ ముందుకు పోయే సమాజాన్ని పట్టుకోవాలి.

తెలుగు కవిత – సామాజిక స్పృహ

22/01/2009

ఈనాడు బాగా వినవస్తున్న మాటలలో సామాజిక స్పృహ కూడా ఒకటి. సోషలిష్టు లక్ష్యాలను కొల్లగొట్టడానికి సోషలిజం మాటను ఢిల్లీ నుండి జిల్లాపరిషత్ అధికార్లదాకా  వాడినట్లుగానే సామాన్య ప్రజల చింతనా క్రమాన్ని మభ్యపెట్టటానికి సామాజిక స్పృహ ను యధేచ్ఛగా వాడుతున్నారు. ఈ అమిత వ్యయాన్ని ప్రవేశపెట్టినవారు రాజకీయ కుక్షింభరులు.

సామాజిక శక్తుల పోరాటాల ఫలితంగా ఒక ఆశయం జాతి నినాదంగా పరిణమిస్తుంది. గత్యంతరం లేని పరిస్తితుల్లో స్వార్ధపరులు ఈ నినాదాన్ని స్వీకరిస్తారు. ఒకటి పరిస్థితుల వత్తిడి. రెండవది అందులో దూరి దాన్ని లేకుండా చేయటం.

భౌతిక దృక్పథాన్ని ప్రవేశపెట్టిన బౌద్ధాన్ని వైదికులు దశావతారాల్లో చేర్చి బుద్ధుణ్ణి విష్ణువు అవతారంగా జమ కట్టేశారు. ఆ తర్వాత బౌద్ధాన్ని ఈ దేశంలో లేకుండా సర్వనాశనం చేశారు. అంతే క్రూరంగా చార్వాకుల్ని నేలమట్టం చేశారు. 

రాజకీయాలు అభివృద్ధి కార్యక్రమాలు సమాజానుగుణంగా ఉండాలనేది ప్రజలు ముందుకు తెచ్చిన నైజం. దీన్నీ అంగీకరిస్తున్నట్లు అభినయిస్తూ ప్రజల్ని మభ్యపెట్టటానికి సామాజిక స్పృహ అనే మాటను పాలకులు యధేచ్చగా వాడుతున్నారు.

నిజానికి ఈ మాటకు నిర్వచనం ఏమిటి ? అభివృద్ధి చెందుతున్న సమాజం గురించి పట్టించుకొని దానికి న్యాయం చెయ్యడం. మళ్ళీ ఇక్కడ ఏ అభివృద్ధి అనేది వస్తుంది. బిల్డింగులా? అధికారాలా? ప్రణాళికలా? పదవులా? లేక ప్రజల ఆశయాలా?

మార్పును కోరే శక్తులకు మార్పును ప్రతిఘటించే శక్తులకు సమాజంలో వివిధ స్తాయిల్లో ఘర్షణ తప్పదు. ఇక్కడ అధిక సంఖ్యాకులైన ప్రజల శ్రేయస్సును కాంక్షించటమే సామాజిక స్పృహ . ఇది కూడా నిరంతరం అభివృద్ధి చెందే పోరాట నైజం. దీనికనుగుణంగానే అన్ని రంగాల్లో సాపేక్షికంగా అభిప్రాయాలు  ప్రచారం అవుతాయి.

ఈ సామాజిక స్పృహ కొత్త విషయమా?

సామాజిక స్పృహ అనేది పత్రికలు , మేధావులు , రాజకీయ నాయకులు సృష్టించిన కొత్తమాటా? కాదు – ఏదో ఒక రూపంలో ఈ భావం అనాదిగా కొనసాగుతున్నదే.

ఎవరైతే సామాజిక ఉత్పత్తి సాధనాల్ని  స్వాధీనం చేసుకున్నారో వారే జీవితానికి సంబంధించిన సమస్త విషయాల్ని శాసించారు. ఆర్ధిక ప్రయోజనాల్ని బట్టే , సారస్వతం, తాత్వికసూత్రాలు, మతనియమాలు, లలితకళలు నిర్వచించబడి పోషింపబడతాయి. వీటినే సంప్రదాయం క్రింద పెద్దలు ప్రచారం చేస్తారు.

నన్నయ్యగారి భారతాంధ్రీకరణలో అక్షరరమ్యత ఎంత ఆకర్షణీయంగా పండితులకు కన్పించినా అది రాజరాజనరేంద్రుడు కోరిన  జగద్ధితంబు గా విరాజిల్లిందనేది దాచేస్తే దాగని సత్యం. అధిక సంఖ్యాకులైన పదకొండవ శతాబ్దపు తెలుగు ప్రజలు ,  వేదాల ప్రామాణికతను  తిరస్కరించే జైన బౌద్ధాల వెంటపడిపోవడాన్ని అరకట్టడానికి వైదికమత పునరుద్ధరణకు మాత్రమే భారతాంధ్రీకరణ జరిగిందనేది చారిత్రక సత్యం .

వైష్ణవులు, శైవులూ తగాదా పడుతూ వుంటే జైనబౌద్ధాలు విజృంభించి వైదికమతం నేలమట్టం అవుతుందనే భయం వల్ల తిక్కన  హరిహరనాధతత్వాన్ని  నాటి తెలుగు సమాజానికి తరుణోపాయంగా సూచించారు. దీనితో పాటు భారతాంధ్రీకరణ శేషభాగాన్ని  నాటకీయత  అనే శిల్పంతో పూరించాడు.

సామాజిక శక్తుల ఆర్ధికావసరాలకు భిన్నంగా ఏ సాహిత్య ప్రమాణాలూ రావు – వచ్చినవన్నీ ప్రజలకనుకూలంగా ఉండవు. సాహిత్య కళా రూపాలూ అంతే. కావ్య శోభకు, కళారూపానికీ , శబ్దసౌందర్యానికి భ్రమపడి సాహిత్య ప్రయోజనం ఏ విషయంలో పొరలు కారాదు.     

ప్రబంధ యుగంలో రాజుల్ని , రాచరికాల్ని,వైభోగాల్ని, ఉంపుడుగత్తెల్నీ పొగడటానికే అష్టాదశ వర్ణనల  క్రింద భ్రష్ట శృంగారం వచ్చిందనేది సత్యం. ఇది మంచపుతాళ్ళు తెగేదాకా పోయింది. ఈ వికృతానికి రోసే కందుకూరి వారు  సరస్వతీ నారద సంవాదం  లో ప్రాచీన కవుల ఇంగితాన్ని ప్రశ్నించారు. శతక కవులు అందునా వేమన మాత్రం అధిక సంఖ్యాకుల ప్రయోజనాన్ని లక్ష్యించి ఒక తిరుగుబాటు వేదాంతాన్ని స్పష్టాస్పష్టంగా ప్రబోధించారు.

సాహిత్య ప్రమాణాలు

ప్రాచీన లక్షణ గ్రంధాలన్నీ రాచరిక వ్యవస్తనూ, చాతుర్వర్ణ ధర్మాన్ని, తద్వారా  శ్రమ దోపిడిని                                                                       సుస్థిరం చేయటానికి అభివృద్ధి చెందాయనేది కూడా నిష్టుర సత్యం . ధీరోదాత్తుడు, ధీరోద్ధాతుడు, ధీరలలితుడు, ధీరశాంతుడు – అనే కావ్య నాయకులు చాతుర్వర్ణ ధర్మ ఔన్నత్య వికాసానికే రూపొందించబడ్డారు. మూడు పాత్రలు క్షత్రియులకైతే ఒకటి ధీరశాంతుని పాత్రను బ్రాహ్మణుడికి కేటాయించారు. సామాన్యుడు, జాలరి, చాకలి, రైతు , వివిధ వృత్తుల వాళ్ళు- వారి సుఖ దు:ఖాలు కావ్య పరిధిలోనికి రానేలేదు. ప్రబంధ యుగాలలోని అష్టాదశ వర్ణనలలో ముఖ్యంగా పుర వర్ణనలో కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, రైతు ఎలా వున్నారనేది చెప్పబడలేదు. చెప్పబడింది కూడా ఆ పై వర్గాల  చట్రం లోని ఎంగిలే. ( కళా పూర్ణోదయం లోని సుగాత్రీ – శాలీనుల గాధ, ఆముక్తమాల్యద లోని పురవర్ణన. )

రామాయణంలోని వెట్టి చాకిరీ సేవిక మంధర- ఆమె వరాల్ని కైకమ్మకు గుర్తు చేస్తే – ఆమెను నీచురాలిగా చూపబడింది. అలాగే చివర రాముడూ, సీతా విడిపోవడానికి చాకలివాడి ఆరోపణ కారణంగా చూపబడి – చాకలివాడు నిందాస్తానంలోకి నెట్టబడ్డాడు. భారతం లోని ఏకలవ్యుడి గాధ – రామాయణం లోని శంభూక వధ హేతుబద్ధంగా ఆలోచించవారికి తాపం కలిగించే సన్నివేశాలు. – వీటన్నిటినీ పరిశీలిస్తే తేలే అంశం ఏమిటి? సాహిత్యం అనేది సమాజానికి భిన్నం కాదు.-   ఎవరైతే సమాజాన్ని శాసిస్తుంటారో వారే సాహిత్యాన్ని కూడా శాసిస్తారు. వీటికి తిరుగుబాటుగా కూడా సాహిత్యం ఉంటుందా? ఉంటుంది. కాబట్టే ఈ దేశములో బౌద్ధుల సాహిత్యం నాశనం చేయబడింది. పాలకులు పాలితుల సాహిత్యాన్ని మననీయరు. అందుకే బౌద్ధసాహిత్యం మంటగలిసింది.

మన సాహిత్యం లోని  రస సిద్ధాంతమే  ఒక ప్రశ్నార్ధకం అది పై వర్గాల మానసిక అనుభూతుల్ని తెలియజేసే భావనా సంవిధానం. అక్కడ రాజు లేక రాణి గార్ల దు:ఖమే కరుణరసం. కానీ సేవకుల శోకం కరుణరసం కాదు. అలాగే శృంగారం, హాస్యం, వీరం, వగైరా నవరసాలు తమకు న్యాయం జరగాలని తెగించి పోరాడిన ప్రజల సుఖదు:ఖాల వర్ణన ఇటీవలి దాకా నవరసాల క్రిందికి రాలేదు. పల్నాటి వీర చరిత్ర  పై వర్గాల సాహస చరిత్ర . శ్రీనాధుడు రాచరికాల ఆస్థాన కవి. పోతన కొంత మినహాయింపు.

సత్యం, శివం, సుందరం అనే సాహిత్య ప్రమాణం కూడా వర్గ నైజమే. చాతుర్వర్ణ విధానానికి సంబంధించిన గాధాసత్యమే  సత్యం  , దాన్ని అందంగా చెప్పటమే  సుందరం  , తద్వారా ఆ వ్యవస్థ కొనసాగించడమే   శివం . ఈ పాక్షిక మంగళం జాతికి ప్రయోజనకరంగా నిలవలేదు. మన సాహిత్యమంతా అధికారపక్ష నియంతృత్వాన్నే వేనోళ్ళ చాటుతుంది.

వీటన్నిటినీ కాదని పెరిగిన ప్రజల సుఖదు:ఖాల పోరాటాల వర్ణనలుగా వచ్చిన  జానపద సాహిత్యం మీద కూడా పైవారల ప్రభావం ఉంది. ఏవర్గం అయితే సమాజాన్ని శాసిస్తుందో ఆవర్గం ప్రభావంలోనే జీవన రంగాలన్నీ బందీ అవుతాయి. ఆ మేరకే జానపద సాహిత్యం కూడా ఇటీవల అభివృద్ధి చెందింది.  ఎంకి నాయుడుబావ  లాంటి జానపద నాయికా నాయకులు , ఆధునికరూపం పొందిన ప్రబంధ నాయకులనేది గ్రహించాలి. వారి భావానుభావ వ్యభిచారీ భావాలు నిజంగా శ్రమైక జీవనం గడిపేవారి సుఖదు:ఖాలు కావు. పై వారి అనుకరణలుగా చేయబడిన క్రింది వారి జీవన విరోధాభాసాలు.

ఈ క్రమం లోంచే భావ కవిత్వం దేశ స్వాతంత్ర్యోద్యమాన్ని  మరిపించేంత వికారంగా   నలుగురు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు గా విరాజిల్లింది. ఈ కవుల శృంగార వారసత్వం వ్యాధి నుండి బయటపడలేదు. ఇలా మన వాదాన్ని జీవన సిద్ధాంతంగా స్వీకరించి అభివృద్ధి చెందే సమాజం  నుండి వేరుపడి…………………..జ్వాలాముఖి ఉపన్యాసం


పని చేసిన వాడికి చెల్లించవలసిన డబ్బులో కొంత మిగిల్చుకోవడం

 


  

 [v1]వస్తువులు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలు మొదలగునవి.

 

జ్వాలాముఖి

20/01/2009

సామాజిక విప్లవానికి నిబద్ధుడైన కవి, కథకుడు, నవలా రచయిత, సాహిత్య, కళా విమర్శకుడూ, విశ్లేషకుడూ అన్నిటికీ మించి మహోపన్యాసకుడు అయిన జ్వాలాముఖి 2008 డిసెంబర్ 14వ తేదీన తీవ్ర అనారోగ్యంతో తన 71వ ఏట హైదరాబాదులో ఆఖరి శ్వాస విడిచారు. వారి మరణం ప్రజా సాహితీ సాంస్కృతికోద్యమానికి తీరని లోటు.

జ్వాలాముఖి – జీవిత విశేషాలు :

జ్వాలాముఖికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఆకారం వీరవెల్లి రాఘవాచారి. ఈయన హైదరాబాదు పాతబస్తీలోని సీతారాంబాగ్ లోగల ప్రసిద్ధ సీతారాముల కోవెల ఆవరణలో 1938 ఏప్రిల్ 12వ తేదీన జన్మించారు. అదే కోవెల ఆవరణలో వేద పాఠశాల , సంస్కృతాంధ్రాలు బోధించే పాఠశాల ఉండేవి. కవి పండితులు వచ్చివెడుతుండేవారు. సాహిత్య సమాలోచనలు జరుగుతూండేవి. నిజాం రాజ్యములోని ఆంధ్ర మహాసభ నాయకులు ,ప్రముఖులూ అనేకులు వచ్చి ప్రసంగాలు చేస్తుండేవారు. అక్కడికి రంగాచారి అనే కమ్యూనిష్టు కార్యకర్త రహస్యంగా వచ్చిపోతూండేవాడు. ( తర్వాత కాలంలో ఈయన అన్న కూతురునే జ్వాలాముఖి వివాహమాడారు ) ఈయన్ను యూనియన్ మిలిటరీ తీవ్ర చిత్ర హింస లకు గురిచేసి కాల్చేసింది. ఆయన మరణవార్త జ్వాలాముఖి పై ప్రభావం వేసింది.

ప్రముఖ విప్లవ కవి , పౌరహక్కుల నాయకుడు ఎ.టి.ఖాన్ జ్వాలాముఖికి బాల్యం నుండి మంచి మిత్రుడు. మల్లేపల్లి ప్రాథమిక పాఠశాలలో , నాంపల్లి హైస్కూలులో , నిజాం కాలేజిలో జ్వాలాముఖి చదువుకున్నారు.

ఒకవైపున కఠిన ఆచార సాంప్రదాయాల శ్రీవైష్ణవ కుటుంబ వాతావరణం, మరోవైపు కటిక పేదరికం వీటినడుమ జ్వాలాముఖి జీవితం గడిచింది.  1958లో జ్వాలాముఖి మనిషి అనే దీర్ఘ కవితను రాసి కరుణశ్రీ ప్రశంశలు పొందాడు.

దిగంబరకవిగా ,విప్లవ కవిగా సమాజంలోని అసమానతలు తొలగిపోవాలని ఆకాంక్షించాడు.ఉపాధ్యాయునిగా పనిచేస్తూండిన జ్వాలాముఖి  1965 నుండి దిగంబరకవిగా నిఖిలేశ్వర్, చెరబండరాజు, నగ్నముని వంటి వారతో కలసి కవితాసంపుటాలు ప్రచురించారు. వీరు వి.ర.సం. గా ఏర్పడిన తర్వాత వీరిని 1971లో పి.డి. చట్టం క్రింద  50 రోజులు ముషీరాబాద్ సెంట్రల్ జైలులో  నిర్బంధించారు. ఈయన ప్రత్యేక తెలంగాణా వాదాన్ని తిరస్కరించాడు. ఈయన భారత చైనా మిత్రమండలికి రాష్ట్ర కార్యదర్సి గా పనిచేశాడు. రెండు సార్లు చైనా దర్శంచాడు.

లౌకికవాదిగా :

హైదరాబాదు నగరం హిందూ-ముస్లీం మతస్తులతో , తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ,మార్వాడీ, లోఢీ తదితర జాతుల తెగలతో కూడివుంటుంది. ఒకరకంగా అదొక మినీ ఇండియా లాంటిది. పాతబస్తీలో పుట్టిన జ్వాలాముఖికి హిందీ సాహిత్యమూ, ఉర్దూ భాషలలో కూడా మంచి ప్రవేశముండటము, బాల్యస్నేహితులు, సాహిత్య సామాజిక సంబంధాలుండటం వల్ల మతకలహాలు చెలరేగినప్పుడల్లా వాటిని శాంతింపజేయడానికి , బాధితులను ఆదుకోవడానికి మిత్రుల సహకారంతో కృషి సల్పటం ఆయన జీవితంలో ఒక భాగమైపోయింది. హిందూ ముస్లీముల ఐక్యతకై నిరంతరం కృషిచేశారు. 2002లో గుజరాతులో ఘోరాలు జరిగినప్పుడు మన రాష్ట్రం నుండి గుజరాత్ రాష్ట్రాన్ని పర్యటించివచ్చిన 28 మంది రచయితలు,కళాకారులలో జ్వాలాముఖి ఒకరు.  ఆయన హిందూత్వ మతోన్మాద శక్తుల తాత్విక డొల్ల తనాన్ని ఎండగట్టటానికి పురాణ గ్రంధాలనుండి సంఘటనలను, ప్రతీకలను తీసుకొని వివరించేతీరు సభికులను మిక్కిలి ఆకట్టుకునేది. జ్వాలాముఖి మరణం లౌకిక వాద శక్తులకు తీరనిలోటు.

నిరాడంబరంగా జీవించడం, కుటుంబంలో ప్రజాస్వామిక సంబంధాలను నెలకొల్పటం, కొడుకులు ముగ్గురికీ కులాంతర మతాంతర వివాహాలు జరిపించటం, .. ఆయన ప్రజాస్వామిక తత్వానికి నిదర్శనం. వ్యవస్థ కల్పించే ప్రలోభాలకు గురి కాకుండా … అవార్డులూ, హోదాలకు, పదవులకూ ఆశపడకుండా ,కెరీరిజానికి లోనవకుండా జీవితం సాగించిన  విశిష్ఠ  వ్వక్తిత్వం జ్వాలాముఖిది.   

తన విద్యార్ధులకు ఏం చెప్పాలి

09/09/2008

 

అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ తన కుమారుడు చదువుతున్న స్కూలు ప్రధానోపాధ్యాయునికి రాసిన లేఖ.

మానవులందరూ న్యాయవంతులూ, సచ్చీలురూ కాదని అతడు నేర్చుకోవాలి. అయితే స్వార్ధపర రాజకీయ నాయకులతో పాటు అంకితభావం గల నాయకులూ వున్నారని , దగాకోరులతోపాటు ధీరోదాత్తులైనవారూ వున్నారని అతనికి నేర్పించండి. శత్రువులున్నట్లే మిత్రులు కూడా వుంటారని చెప్పండి. కొంత సమయం పట్టినాసరే , దొరికిన ఐదు డాలర్లకంటే సంపాదించిన ఒక్క డాలరే విలువైనదని అతనికి తెలియచెప్పండి. పోగొట్టుకోవడాన్ని భరించగలగాలనీ , గెలుపుకు సంతోషించాలనీ నేర్పించండి. అసూయకు దూరంగా వుండడం, నిశ్శబ్దంగా సంతోషించడం నేర్పించండి. సోమరిపోతులు ఆశపోతులనే విషయం అతనికి తొందరగా తెలియజెప్పండి. వీలుంటే పుస్తకాలలోని అద్భుతాలను అతనికి వివరించండి. అయితే ఆకాశంలో పక్షులు ఎగరగలగడం, మండుటెండలో తేనెటీగలు సంచరించడం, పచ్చని కొండచరియల్లో పువ్వులు వికసించడం తాలూకు రహస్యాలు ఛేదించడానికి అతనికి తగిన సమయం ఇవ్వండి.

మోసం చెయ్యడం కంటే విఫలమవడంలోనే గౌరవముందని మీ బడిలో నేర్పండి. ప్రతివొక్కరూ తప్పు అని చెప్పినాసరే తన స్వంత ఆలోచనలమీద విశ్వాసముంచాలని అతనికి తెలియజేయండి. ఉన్నతమైన వ్యక్తులతో ఉన్నతంగా మెలగాలనీ, దుండగులతో కఠినంగా వ్యవహరించాలనీ నేర్పించండి. అందరూ గుంపుగా చేరినప్పుడు అతను కూడా వాళ్ళలో కలసిపోకుండా వుండగలిగే శక్తిని సంపాదించుకోమనండి. ఎవరు చెప్పినా వినాలనీ, అయితే వాస్తవ దృక్పథంతో పరిశీలించిన తరువాత మాత్రమే అంగీకరించాలని నేర్పించండి. మీకు వీలయితే విచారంలో ఉన్నప్పుడు కూడా నవ్వుతూ వుండగలగడం నేర్పించండి. అయితే కన్నీళ్ళు పెట్టుకోవడానికి సిగ్గుపడ నక్కరలేదని చెప్పండి. తప్పులెన్నేవారిని లెక్కచేయకూడదనీ, తియ్యటి మాటలు చెప్పేవారితో జాగ్రత్తగా వుండాలనీ తెలియ జెప్పండి. శరీర దారుఢ్యాన్నీ, మేధాశక్తిని ఎక్కువ వెల ఇవ్వగలిగిన వారికే అమ్ముకోవాలనీ, అయితే హృదయానికీ, ఆత్మకూ మాత్రం ఎన్నటికీ వెలకట్టగూడదనీ అతనికి తెలియజేయండి. అల్లరి మూకల కేకలు చెవినిపెట్టకుండా , తన ఆలోచన సరియైనదైతే నిలబడి పోరాడాలని నేర్పించండి. సున్నితంగా బోధించండి గానీ గారాబం చెయ్యవద్దు. కాల్చినప్పుడేకదా ఉక్కు గట్టిపడేది. అసహనంగా వుండడంలో గల సాహసాన్ని గుర్తించమనండి. ధైర్యశీలికి కావలసిన సహనాన్ని అలవరచుకోమనండి. తన మీద తనకు అచంచలమైన విశ్వాసం కలిగివుండాలని బోధించండి. అప్పుడే అతడు మానవత్వంపై ఎన్నటికీ సడలిపోని విశ్వాసాన్ని నిలుపుకోగలడు.”

టీచర్ల సమస్యలు

23/06/2007

1998లో ప్రభుత్వ ఉపాధ్యాయులను , స్థానిక సంస్థల ఉపాధ్యాయులను కలిపి ఉమ్మడి సీనియారిటీ అమలు చేయుటకు జీవోలు 505, 538 లను ప్రభుత్వం ఇచ్చింది. కానీ 2003 సెప్టెంబర్ 18న హైకోర్టు తీర్పు ఇస్తూ రాజ్యాంగం 371 (డి) ఆర్టికిల్ ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసును  లోకల్ కాడర్ గా రాష్ట్రపతి చేత ప్రకటించబడియున్నందున , అట్లా లోకల్కాడర్ గా పరిగణించని పంచాయితీరాజ్ ఉపాధ్యాయుల సర్వీనుతో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్వీసును  కలుపరాదని   తీర్పు ఇస్తూ ఆ జీవోలు ( 505, 538 ) కొట్టివేసింది. ఏకీకృత సర్వీసుల కోసం రాష్ట్ర  ప్రభుత్వం  పంచాయితీరాజ్ ఉపాధ్యాయులను లోకల్ కాడర్ గా ఆర్డినెన్సు తెచ్చి , జీవోలు 95, 96 జారీ చేసి  ఆ తర్వాత చట్టం చేసింది.  మరలా హైకోర్టు ఆ జీవోలను కొట్టివేస్తూ స్థానిక కేడర్లను తనంతట తాను సృష్టించడం గానీ , రద్దు చేయడంగానీ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని , ఏది జరిగినా రాష్ట్రపతి అనుమతి అనంతరమే జరగాలని  కనుక స్థానిక సంస్థల ఉద్యోగులు లోకల్ కేడర్లు గా పరిగణించరాదని , ఏకీకృత సర్వీసుల చట్టం , సంబంధిత జీవోలు  95, 96  చెల్లవని హైకోర్టు తీర్పు ఇచ్చింది.ఆరు అంశాల సూత్రం   1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమం,  1971లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ల ప్రభావం వలన కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి రెండు ప్రాంతాలు సమైక్యంగా  ఒకే రాష్ట్రంగా కొనసాగడానికి , తెలంగాణాతోసహా ఇతర వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి , ఆ ప్రాంతాల ఉపాధి అవకాశాలు మరియు విద్యా సౌకర్యాల మెరుగుకై ఆరు అంశాల సూత్రం ( సిక్స్ పాయింట్ ఫార్మూలా ) రూపొందించి అమలు చెయ్యాలని 21-9-1973 నాడు రాష్ట్రానికి అందజేసింది. ఆరు అంశాల సూత్రం లో భాగంగా ది.3-5-1974 నాడు 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 371-డి , ఆర్టికల్ 371-ఇ లను కొత్తగా చేర్చారు. ఆర్టికల్ 371 డి    రాజ్యాంగం ప్రకారం ఇంతవరకు కులపరంగా రిజర్వేషన్ కు అవకాశమున్నది కానీ ఈ ఆర్టికల్ ప్రకారం స్థానిక నివాసం ఆధారంగా రిజర్వేషన్ కల్పించడానికి అవకాశం కలిగింది. ఈ ఆర్టికల్ ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి మాత్రమే వర్తిస్తుంది. జీవో 674 ద్వారా 20-10-1975న ప్రత్యేక ఆదేశాలను రాష్ట్రపతి జారీచేశారు. 27నెలలలోపల రాష్ట్రంలోని వివిధ పోష్టులను ప్రత్యేక లోకల్ క్యాడర్లుగా ఏర్పాటు చెయ్యాలి. ఈ విధంగా ఏర్పాటైన లోకల్ కాడర్ ఆయా కేటగిరీ పోష్టులకు నియామకానికి, సీనియారిటీ, ప్రమోషనుకు , బదిలీకి , ఉద్వాసనకు ఒక ప్రత్వేక యూనిట్ గా పరిగణింపబడుతుంది. అయితే 17-1-1978నాటికి గడువు ముగిసింది.  ప్రభుత్వ ఉపాధ్యాయులను జీవో నెం. 529 ద్వారా 14-5-1976నుండి లోకల్ కేడర్ గా ప్రకటించింది. గడువు ముగిసిన తర్వాత కూడా రాష్ట్రపతి ఏ పోష్టులనైనా ఆయా ప్రాంతాల్లో లోకల్ కేడరుగా ప్రకటించవచ్చు. జూనియర్ అసిస్టెంటు , అంతకు తక్కువ స్థాయ గల పోష్టులను జిల్లా స్థాయి కేడరుగా ఏర్పాటు చేశారు. పాఠశాల విద్య  సబార్డినేటు సర్వీసు నుంచి సెకండరీ గ్రేడు, స్కూలు అసిస్టెంటు పోష్టులసు 1-1-1974 నుండి ప్రతి జిల్లా ఒక ప్రత్యేక లోకల్ ఏరియాగా పరిగణించాలని జీవో106(ఇ) ద్వారా ది.4-2-2000 న రాష్ట్రపతి ఉత్తరువులకు సవరణ తెచ్చారు. ఇటువంటి సవరణ ఉత్తరువును  పంచాయితీరాజ్ ఉపాధ్యాయుల విషయంలో తేవడం మరచారు. ఆ తర్వాత తెద్దాం లెమ్మని నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరించారు. రాష్ట్రం లోని 23 జిల్లాలను 6 జోన్లుగా ( ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం అన్నట్లుగా) విభజించారు. 1981లో పంచాయితీరాజ్ ఉపాధ్యాయులను ప్రొవిన్షియలైజ్ చేశారు, కానీ లోకల్ కేడర్ గా పరిగణింపలేదు. రాష్ట్రపతి ఉత్తర్వులు లేకుండా జీవోలు ఇచ్చినందున  1992లో, 1998లో, 2005లో ఇచ్చిన  ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది.రాష్ట్రపతి ఉత్తర్వులలో ప్రభుత్వ,మండల పరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని గజిటెడ్, నాన్ గజిటెడ్ ఉపాధ్యాయుల పోష్టులను లోకల్ కేడరుగా మార్చే క్లాజు చేర్చాలని , రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేసుకొనే అధికారం రాష్ట్రానికి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కాబట్టి ఈ ప్రతిపాదన పరిశీలించడం సాధ్యపడదని కేంద్రం అంటుంది. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపండి అని ఒక్కమాట చెప్పడానికి 1973 నుండి 2007 వరకు నోరు రాని ప్రజాప్రతినిధులకు విద్య పట్ల ఎంత ఆసక్తి వుందో తెలియడంలేదా ?